9, ఆగస్టు 2013, శుక్రవారం

పచ్చి అసత్యాలు -సీఎం ప్రెస్‌మీట్‌పై కేసీఆర్ కౌంటర్

పచ్చి అసత్యాలు
-సీఎం ప్రెస్‌మీట్‌పై కేసీఆర్ కౌంటర్
-సర్‌ప్లస్ పవర్ స్టేట్‌గా తెలంగాణను నిర్మించుకుంటాం
-28 రాష్ట్రాలకు వర్తించిన నియమాలే 29వ రాష్ట్రానికి వర్తిస్తాయి


హైదరాబాద్ : సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం విలేకర్ల సమావేశంలో లేవనెత్తిన అంశాలపై టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. సమైక్య అక్కసుతో సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి పచ్చి అసత్యాలు మాట్లాడుతున్నారని, సీఎం మాటలు తెలంగాణ ప్రజలను బయాందోళనకు గురిచేయడమే కాకుండా సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టేవిధంగా ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ కనీసం జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని, నిన్న సీఎం మాట్లాడిన విషయాల్లో ఒక్కటి కూడా నిజం కాదని, దీనిపై బహిరంగ చర్చకైనా సిద్ధమని కేసీఆర్ సవాల్ విసిరారు. సమైక్యత కోసం సంతకం చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఏ అర్హతతో ఈ రాష్ట్రానికి సీఎంగా కొనసాగుతారని నిలదీశారు. నిన్నటి ప్రెస్‌మీట్‌లో కిరణ్ లేవనెత్తిన ప్రతి అంశంపై కేసీఆర్ వివరణ ఇచ్చారు. తెలంగాణలో కేవలం 41 మెగావాట్ల విద్యుత్ లోటు మాత్రమే ఉందని, తెలంగాణ ఏర్పాటైన తర్వాత సర్‌ప్లస్ పవర్ స్టేట్‌గా నిర్మించుకుంటామని కేసీఆర్ చెప్పారు. ఇక నీటి విషయంలో దేశంలో 28 రాష్ట్రాలకు వర్తించే నియమాలే 29వ రాష్ట్రంగా ఏర్పడే తెలంగాణకూ వర్తిస్తాయని, పాకిస్తాన్ వంటి దేశంతోనే ఐదు నదుల నీటిని పంచుకుంటున్నామని రెండు రాష్ట్రాలుగా విడిపోతే నీటి సమస్యలొస్తాయనటం అవివేకమన్నారు. నిన్నటి ప్రెస్‌మీట్‌లో సీఎం లేవనెత్తిన ప్రతి అంశంపై కూలంకుశంగా కేసీఆర్ వివరణ ఇచ్చారు.

విద్యుత్ లెక్కలు పచ్చి అసత్యాలు
హైదరాబాద్ : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తెలంగాణలో విద్యుత్ కొరత ఏర్పడుతుందని సీఎం చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ సమాధానం ఇచ్చారు. తెలంగాణలో ఉత్పత్తి అయ్యే కరెంట్ పోను 418 మెగావాట్ల విద్యుత్ లోటు ఉందని తెలిపారు. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 4825 మెగావాట్లు అని పేర్కొన్నారు. థర్మల్ పవర్ నుంచి విద్యుత్ ఉత్పత్తి 2282 మెగావాట్లు, హైడల్ పవర్ నుంచి 543 మెగావాట్లు ఉత్పత్తి అవుతుందని చెప్పారు. ఏడాది మొత్తం తెలంగాణకు హైడల్ పవర్ కెపాసిటీ 800 మెగావాట్లు అని తెలిపారు. తెలంగాణకు 2458 మెగావాట్ల విద్యుత్ కొరత ఉందని, తెలంగాణకు మొత్తం అవసరమైన విద్యుత్ 6848 మెగావాట్లు అని చెప్పారు. కేంద్రం దగ్గర 200 మెగావాట్ల విద్యుత్ ఉంటుందని పేర్కొన్నారు.నిన్న సీఎం ప్రెస్‌మీట్ తర్వాత ఛత్తీస్‌గఢ్ సీఎంతో తాను స్వయంగా మాట్లాడానని కేసీఆర్ తెలిపారు. రెండున్నర నెలల్లో ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణకు గ్రిడ్ కనెక్టీవిటీ ఏర్పాటు చేయొచ్చు అని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి 1000 నుంచి 1500 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేసుకుంటామని చెప్పారు. గోదావరికి అవతలికి ఇవతలికి లైన్ వేసుకుంటే 600 మెగావాట్లు విద్యుత్ వస్తుందని తెలిపారు. తెలంగాణలో అదనంగా 10 వేల మెగావాట్ల విద్యుత్‌ను అదనంగా ఉత్పత్తి చేసుకుంటామని చెప్పారు. ఇంకా మిగులు విద్యుత్ ఉండేలా చూసుకుంటామని చెప్పారు. తెలంగాణలో 6,620 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి చేయడానికి ప్రోగ్రామ్డ్ ప్రాజెక్టులున్నాయని పేర్కొన్నారు. చెన్నూరులో వదిలేసిన బొగ్గు గనులను రీ - ఒపెన్ చేస్తామన్నారు. మరో 3-4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్స్ ఏర్పాటు చేసుకోవచ్చు అని తెలిపారు. కేటీపీఎస్‌లో మరో 800 మెగావాట్లు, భూపాలపల్లిలో మరో 800 మెగావాట్లు, సత్తుపల్లిలో 600 మెగావాట్లు, రామగుండంలో 1320 మెగావాట్లు ఉత్పత్తి చేసుకుంటామని పేర్కొన్నారు.రాష్ట్రం విడిపోతే ఆంధ్రకు 300 మెగావాట్లకు పై చిలుకు మిగులు విద్యుత్ ఉంటుందని చెప్పారు. ఒరిస్సా నవ్‌గావ్‌సలేలో 2500 మెగావాట్ల విద్యుత్‌ను రాష్ట్రానికి కేంద్రం కేటాయించిందని గుర్తు చేశారు. దాని గురించి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంట్ సమస్య మీద తాము నిపుణులను తీసుకొస్తం.. మీరు నిపుణులను తీసుకురండి.. బహిరంగ చర్చకు సిద్ధమని కేసీఆర్ సవాల్ విసిరారు.మద్రాస్ నుంచి ఆంధ్ర విడిపోయినప్పుడు విద్యుత్ ఎంత అని ప్రశ్నించారు. తమ కంటే 90 శాతం వరస్ట్ రేంజ్‌లో ఉన్నారు అని గుర్తు చేశారు.


న్యాయసూత్రాల ప్రకారమే నీటి పంపకం
హైదరాబాద్ : నీటి పంపకాల విషయంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి లేనిపోని అపోహాలు సృష్టిస్తున్నారని, మిడిమిడి జ్ఞానంతో తెలిసి తెలియక మాట్లాడటం చాలా బాధాకరమని కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అంతర్జాతీయ న్యాయసూత్రాల ప్రకారమే నీటి పంపకం జరుగుతుందని తెలిపారు. నదులను దేశాలే పంచుకున్నప్పుడు తెలంగాణ, సీమాంధ్ర పంచుకోలేవా అని ప్రశ్నించారు. నీటి పంపకం విషయంలో అపోహాలు సృష్టించి భవిష్యత్ తరాల్లో విషబీజాలు నాటొద్దు అని విజ్ఞఫ్తి చేశారు.సీఎం ఎకరువు పెట్టుకుంటూ సముద్రంలోకి 3 వేల క్యూసెక్కులుగా నీరు వృథాగా పోతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారే.. పాలకులుగా ఆయన ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్లే సముద్రంలోకి నీళ్లు పోతున్నాయని స్పష్టం చేశారు. 57 ఏళ్ల తరువాత సీమాంధ్రులకు ఇవన్నీ గుర్తొస్తున్నాయా అని అడిగారు. 14 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న చిన్న చిన్న ప్రాజెక్టులు 16 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాయా అని ప్రశ్నించారు. మీ ప్రాజెక్టులను తాము నమ్మలా అని అడిగారు. ప్రాణహిత, చేవెళ్లతో 16 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామంటున్నారు.. దానికి కేటాయించింది మాత్రం 14 టీఎంసీల నీళ్లు.. ఇలా పొంతన లేకుండా సీఎం చెప్పడం సబబు కాదన్నారు.14 టీఎంసీలతో 16 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యమా అని ప్రశ్నించారు. రేపు తెలంగాణ రాష్ట్రంలో గోదావరి మీద ఒక జాతీయ ప్రాజెక్టు, కృష్ణా మీద ఒక జాతీయ ప్రాజెక్టు కడుతామని తెలిపారు. నీళ్ల పంపకం విషయంలో 2 రాష్ట్రాలకు ఏ నియమాలున్నాయో... 29వ రాష్ట్రమైనతెలంగాణకు అవే నియమాలు ఉంటాయని చెప్పారు. ఐదు నదులను పాకిస్తాన్‌ను పంచుకుంటున్నానయని గుర్తు చేశారు. ఇతర దేశాలతోనే మన దేశం నీటిని పంచుకుంటున్నప్పుడు తెలంగాణ, సీమాంధ్ర నీటిని పంచుకోవడానికి అభ్యంతరాలు ఎక్కడ ఉంటాయని అడిగారు.

హైదరాబాద్ లో సీమాంధ్ర అడ్వకేట్ల సంఖ్యపై చర్చకు సిద్ధం
హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఉండేది 10 నుంచి 15 వేల మంది అడ్వకేట్లు మాత్రమే అని కేసీఆర్ తెలిపారు. అడ్వకేట్ల మీద ఎలాంటి చర్చకైనా సిద్ధమేని చెప్పారు. ఇక్కడ 1919లో నిజాంకాలంలో హైకోర్టు ఏర్పడద్దని గుర్తు చేశారు. మీకు 1954లో గుంటూరులో హైకోర్టు ఏర్పడద్దని తెలిపారు. హైదరాబాద్ హైకోర్టులో ఆంధ్ర అడ్వకేట్లు ఉన్నది 3 వేల నుంచి 4 వేలు మాత్రమే అని తెలిపారు. కిరణ్‌కు జ్ఞానం లేక తాను మాట్లాడింది హాస్యాస్పదం అంటారు.. కావాలంటే హైకోర్టుకు సంబంధించిన వివరాలను పూర్తిగా సీఎంకు ఇవ్వడానికి సిద్ధమని కేసీఆర్ పేర్కొన్నారు. కిరణ్ ఎవరిని భయపెట్టడానికి అబద్ధాలు చెబుతున్నారని ప్రశ్నించారు.

ఉద్యోగుల విషయంలో కాకిలెక్కలే
తెలంగాణ వాళ్లకు దక్కాల్సిన ఉద్యోగాల్లో సీమాంధ్ర ప్రాంతం వాళ్లు అక్రమంగా వచ్చారని తాము పోరాటం చేశామని కేసీఆర్ తెలిపారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌లో సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యాలపై మీడియాతో మాట్లాడారు. 610 జీవో ప్రకారం 58,956 మంది ప్రాంతేతర ఉద్యోగులు ఉన్నారని కేసీఆర్ వివరించారు. గిర్లిగాని కమిటీ, 610 జీవోలు చూడకుండానే వెళ్లి పోవాల్సిన ఉద్యోగులు పద్దెనిమిది వేల మంది ఉద్యోగులేనని కాకి లెక్కలు చెబుతున్నారని అన్నారు. 83 వేల మంది ఉద్యోగులను తరలించమని జీవోలు జారీ చేసింది ఆంధ్ర సీఎంలే కదా అని కేసీఆర్ ప్రశ్నించారు. సకల జనుల సమ్మె కాలంలో ఎనబై ఆరు శాతం మంది ఉద్యోగులు హాజరయ్యారని సీమాంధ్ర మీడియానే కదా రాసింది అని ఆయన గుర్తు చేశారు. మొన్న తెలంగాణ ఏర్పాటును సీడబ్ల్యూసీ ప్రకటించిన తర్వాత ‘మేం పోనేపోం అంటూ రోడ్లపైకి వచ్చిన వేలాది మంది ఉద్యోగులు ఎక్కడి వాళ్లు’ అని కేసీఆర్ ప్రశ్నించారు. ఉద్యోగుల విషయంలో తెలంగాణ వాళ్లకు అన్యాయం జరిగింది నిజంకాదా అని నిలదీశారు. తెలంగాణ ఫేర్ షేర్ ఎక్కడాలేదని, అంతా 4-6 శాతమేనని ఆవేదనతో అన్నారు. అన్ని హెచ్‌ఓడీల్లో ఆంధ్రోళ్లే తిష్ట వేశారని విమర్శించారు.

ఎవరినీ నేను వెళ్లిపొమ్మనలేదు
తెలంగాణ ప్రాంతంలో అక్రమంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉద్యోగాలు చేస్తున్న సీమాంధ్ర వాసులను తాను వెళ్లిపోమని అనలేదని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ ఏర్పడితే ఈ ప్రాంత ఉద్యోగులు ఇక్కడి సెక్రటేరియట్‌లో పనిచేస్తారని, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్లు సీమాంధ్ర సెక్రటేరియట్‌లో పనిచేస్తారని మాత్రమే తాను అన్నానని పేర్కొన్నారు. అసలు వెళ్లండి అనే మాటను తాను ఉచ్చరించలేదని స్పష్టం చేశారు. అయినా ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు ఎక్కడ పనిచేయాలో ఆంధ్రా సర్కారు నిర్ణయిస్తుందని తెలిపారు. అసలు మీ ప్రాంత ఉద్యోగుల మా వద్ద పనిచేస్తే మా సర్కార్‌కే కదా టాక్స్ వస్తుందని ఆయన వివరించారు. అలాంటప్పుడు మేమెందుకు పొమ్మంటామని అన్నారు.

సీఎం కిరణ్‌వి పసలేని వాదనలు 
హైదరాబాద్ : రాష్ట్రాన్ని విభజించొద్దని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. సీఎం అర్థం లేని, పసలేని వాదనలు చేసిండు అని ధ్వజమెత్తారు. కిరణ్ మెంటల్ స్టేటస్ సరిగా లేక హైదరాబాద్ స్టేటస్ మీద ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రా వాళ్లు వేరే వాళ్లు అని తాము ఏనాడూ అనలేదని స్పష్టం చేశారు. తెలంగాణలో పుట్టినోళ్లంతా తెలంగాణ బిడ్డలే అని పేర్కొన్నారు. కిరణ్ కూడా ఇక్కడే ఉండొచ్చు.. కర్రీ పాయింట్, టిఫిన్ సెంటర్ పెట్టుకోవచ్చు అని సూచించారు.

కలిసుంటే తెలంగాణకు ఒక్క లాభం చెప్పవు
ఆంధ్రప్రదేశ్ విడిపోతే సీమాంధ్ర నష్టపోతుందని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అనడాన్ని కేసీఆర్ తప్పుబట్టారు. విడిపోతే నష్టాల గురించి సీఎం చెబుతున్నాడుగానీ, కలిసుంటే తెలంగాణకు వచ్చే లాభాలేంటని కేసీఆర్ ప్రశ్నించారు. ఉద్యమాలతో రాష్ట్రాలు ఏర్పడవనే కిరణ్ వాళ్ల పొట్టి శ్రీరాములు మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోవడానికి ఎంత త్యాగం చేశాడో గుర్తించాలని కేసీఆర్ సూచించారు. ఉద్యమాల ద్వారా రాష్ట్రాలు ఏర్పడవని సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి అనడం పొట్టి శ్రీరాములును అవమానించడమేనని తెలిపారు. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రులు విడిపోయేటపుడు తమిళులను ఎన్ని మాటలనలేదని ప్రశ్నించారు. అప్పటి మద్రాసు సీఎం రాజాజీని నామాల నల్లకాకి అని తిట్లలేదా అని అన్నారు.

ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదనడం తప్పు
తెలంగాణ ఏర్పాటు పార్టీపరంగానే జరిగిందని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంకాదని సీఎం కిరణ్ వ్యాఖ్యానించడంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోజు సీడబ్ల్యూసీతోపాటు యూపీఏ సమన్వయ కమిటీలో కూడా చర్చించాకే తెలంగాణ ప్రకటన వచ్చిందని కేసీఆర్ తెలిపారు. యూపీఏ సమన్వయ కమిటీలో ప్రభుత్వం తరపున ప్రధాని పాల్గొనలేదా అని ప్రశ్నించారు. సీఎం అవగాహన లేకుండా మాట్లాడటం తగదని అన్నారు.

ఏ అర్హతతో సీఎంగా ఉన్నావు
సమైక్యాంధ్ర నేతలు రూపొందించిన సమైక్య నోట్‌పై సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి సంతకం చేయడాన్ని కేసీఆర్ తప్పుబట్టారు. సమైక్య నోట్‌పై సంతకం చేసి కాంగ్రెస్ అధిష్ఠానానికి పంపించిన సీఎం ఏ అర్హతతో తెలంగాణ ప్రాంతానికి సీఎంగా వ్యవహరిస్తున్నాడని ప్రశ్నించాడు. ఈ ప్రాంత ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండానే ఎలా సంతకం చేశారని నిలదీశారు. సీమాంధ్ర నేతలు స్వార్థంతో కలిసుందామని అంటే సీఎం కిరణ్ వారికి వంత పాడుతున్నాడని విమర్శించారు.

1 కామెంట్‌:


  1. కే సి ఆర్ లా కుండలు బద్దలు కొట్టి చెప్పగలిగే నాయకుడు మరెవ్వరూ లేదు . సవాలే సవాల్ ! గ్రేట్ కేసీఆర్ . మాటల మాంత్రికుడు అని ఊరికే అన్నారా మరి ? కౌంటర్ సవాల్ కి ఇక ఎదురు జవాబు చెప్పలేనంత గా జాడించారు కేసీఆర్ కీప్ ఇట్ అప్ కేసీఆర్

    జిలేబి

    రిప్లయితొలగించండి